ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం..!
అమ్మ ఒడి విడిచి బడిలో చేరేలోపే మృత్యువు కబలించింది. ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతున్న చిన్నారుల ఆనందం తాగుబోతు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆవిరైపోయింది. ఇంట్లో చేరి బొమ్మలతో ఆడుకోవాలనుకున్న పసిమొగ్గల ఆలోచనలు జలరక్కసి కోరల్లో చిక్కి మునిగిపోయాయి. ఒక్కరా ఇద్దరా 14 మంది బోసి నవ్వుల చిన్నారులు ప్రాణం విడిచారు. మరో 30 మంది చిన్నారులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
ఖమ్మం జిల్లాలోని రేగోండపాలేం వాగులో పడి చనిపోయిన పసిపిల్లల కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో ప్రభుత్వ ఆసుపత్రి బోరుమంది. బంధువులు, అధికారులు ప్రజాప్రతినిధుల ఓదార్పుతో చెలించిపోయింది. జిల్లా అంతటా ఎల్వీ రెడ్డి స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేఖంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయినయి. విద్యార్ధి సంఘాలు స్కూల్ బంద్ కు పిలుపునిచ్చినయి. చనిపోయినవారంత పసిపిల్లలే కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నరు. తమ బిడ్డల చావుకు కారణమైన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నరు. ఇక ప్రమాదం పట్ల సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేసిన్రు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింరు.





